సీఎం జగన్ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు మహూర్తం దగ్గరపడినట్టు అర్థమవుతోంది. పాత మంత్రులంతా ఈనెల 27న రాజీనామా చేయాలని జగన్ ఈపాటికే సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రులతో ఉగాదికి ప్రమాణ స్వీకారం చేయిస్తారని అంటున్నారు. అయితే కొత్తటీమ్ లో పాతవారు ఎవరుంటారనేది ప్రస్తుతానికి తెలియడంలేదు. చివరిగా ముగ్గురు మిగులుతారని, కాదు కాదు ఐదుగురుంటారని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చివరికి మాజీలెవరూ వద్దు, అంతా కొత్తవారేనని జగన్ చెబితే అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు.
కొత్త జిల్లాల వారీగానే మంత్రుల్ని నియమించబోతున్నట్టు సమాచారం. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటు, దానితోపాటే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అన్నీ ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నాయి. ఈసారి కూడా సామాజిక కూర్పు బాగుంటుందని, మహిళలకు, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తారని అంటున్నారు నేతలు.